Sunday, May 23, 2010

నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన





వేణువై వచ్చాను భువనానికి, గాలిని పోతాను గగనానికి అంటూ మీరు వెళ్ళిపోయిన ఈ రోజు నిజంగా అంతా శూన్యం లాగ అనిపిస్తుంది.
"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ. మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.
వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది. నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే. ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర. కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.

ఎంతెంత వైవిధ్యం, వైరుధ్యం ఆ రాతల్లో? ఆకు చాటు పిందె తడిసె, తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, సిరి మల్లె పూవా, వేణువై వచ్చాను భవనానికీ, కొమ్మకొమ్మకో సన్నాయీ, ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరీ, ఒక్కో పాటకీ పొంతనా పోలికా లేకుండా రాయగల మేథావి, సరస్వతీ పుత్రుడు ఇలా అకస్మాత్తుగా అస్తమించడం నిజంగా తెలుగు శ్రోతల దురదృష్టమే!

పండితుడినైనా పామరుడినైనా కదిలించగల శక్తి సంగీతానికి వుంటే ఆ సంగీతంలోని స్వరాలను పదాలతో జతపరచి కవితా మాలిక లల్లి, కన్నీటీ వాగులలో... పన్నీటి వరదలలో... నవ్వుల చిరుగాలులలో, నిట్టూర్పుల సుడిగుండాలలో అన్నింటిలోనూ పరకాయ ప్రవేశం చేయించి అందరిని అలరించగల పదాల గారడోడు, ప్రాసల చమక్కు లతో మెరిపించగల కవితా ధీశాలి మన వేటూరి.
తెలుగు పాటను పరవళ్ళు తొక్కించిన ఆ కలం ఆగిపోయింది. ఆకాశ దేశాన, వైశాఖ మాసాన...వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అలా అర్ధాంతంగా వెళ్ళిపోయిన ఆ మహాకవికి అంజలి ఘటించక చేసేదేముంది.? ఆయనకు ఎవరూ సాటి లేరు ఇక రారు. వారికి ఆశ్రునివాళులతో...
ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తూ.... సకలపూజలు.కాం కవిరాజుకు ప్రఘాడ సంతాపం తెలియజేస్తుంది.

వేటూరి అమర్ రహే హై...................................................

No comments: